సిద్దిపేట, డిసెంబర్ 25: డిజిటల్ మనీ ట్రాన్జాక్షన్లో భాగంగా ప్రజలు క్యూఆర్ కోడ్ సాన్తో క్షణాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారి సిద్దిపేటలో అందుబాటులోకి తెచ్చారు. క్యూటీఎం ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట మాడల్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్తో డబ్బులు విత్ డ్రా చేసుకొని మిషన్ను సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ సాన్ చేస్తే క్షణాల్లో నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయడంపై సంస్థ ప్రతినిధులను అభినందించారు. మినీ ఏటీఎం మాదిరిగానే క్యూఆర్ మినీ ఏటీఎం పనిచేస్తుందని తెలిపారు. ఆధార్ కార్డు, వేలిముద్ర, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ సానింగ్, యూపీఐ సర్వీసెస్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీహబ్ ద్వారా రూపొందించిన ఈ టెక్నాలజీని సిద్దిపేటలో తొలిసారి ప్రారంభించినట్టు పేర్కొన్నారు. క్యూటీఎం ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందని హరీశ్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ చికోటి నరేశ్గుప్తా, కో చైర్మన్ షేక్ షమీం, తెలంగాణ స్టేట్ డీలర్ రమేశ్, సిద్దిపేట జిల్లా డీలర్ జనార్దన్, ఆయా జిల్లాల డీలర్లు పాల్గొన్నారు.