హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గురువారం తెరిపిలేకుండా వాన లు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని, ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్పిన వాతావరణశాఖ .. రెడ్ అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటం తో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని అంచనా.
భద్రాచలం వద్ద గోదావరి గురువారం మ ధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ ప్రియాంక ఆల మొ దటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఏస్తారు. భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం (ఫోన్ నెంబర్ 08743- 232444), కొత్తగూడెం కలెక్టరేట్లో కం ట్రోల్ రూమ్స్ (ఫోన్ నంబర్- 08744-241950)ను ఏర్పాటు చేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. పాపికొండల విహార యాత్రను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తాడ్వాయి మండలం అల్లిగూడేనికి చెందిన గుమ్మడి సాంబలక్ష్మి, అనూష అనే గర్భిణులను వైద్యాధికారులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును బుధవా రం దాటించారు. ప్రత్యేక వాహనంలో ములుగు ప్రభు త్వ దవాఖానకు తరలించగా, గురువారం సాంబలక్ష్మి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
హైదరాబాద్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో.. పలుచోట్ల ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. గురువారం రాత్రి కూడా నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాణహితకు వరద పోటెత్తుతున్నది. గురువారం సాయంత్రానికి 5.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. లక్ష్మీబరాజ్ నుంచి 65 గేట్లను ఎత్తి వరదను విడుదల చేస్తున్నారు.