హైదరాబాద్/నల్లగొండ ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి, బంజారాహిల్స్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచనున్నారు. తరువాత నల్లగొండకు తీసుకెళ్లి, మధ్యాహ్నం ఒంటి గంటవరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తారు. అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం 3.30 గంటలకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.
మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమెను పీడిత ప్రజల పక్షపాతిగా అభివర్ణించారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని పేర్కొన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని అవేదన వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాను, మల్లు స్వరాజ్యం ఒకేసారి శాసనసభలో ప్రాతినిధ్యం వహించినట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తుచేసుకొంటూ సంతా పం ప్రకటించారు. స్వరాజ్యం మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గొరటి వెంకన్న, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీపీఎం నాయకులు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకులు సురవ రం సుధాకర్రెడ్డి, నారాయణ, చాడ వెంకట్రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి సూర్యం, వివిధ ప్రజాసంఘాల నేతలు సంతాపం వ్యక్తంచేశారు.
ఆంధ్రమహాసభ ద్వారా ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కీలకపా త్ర పోషించారు. తొలుత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాత సీపీఎంతో జీవితాంతం కొనసాగారు. ఆమె ఉపన్యాసాలు ఉత్తేజభరితంగా సాగేవి. రజాకార్లకు వ్య తిరేకంగా సాగిన పోరాటంలో ప్రజలను సమీకరించేందుకు ఆమె బతుకమ్మ పాటలను కూడా ఎంచుకోవడం విశేషం. భీంరెడ్డి నర్సింహారెడ్డితోపాటు ఆమెపై కక్షగట్టి న రజాకార్లు 1947-48 ప్రాంతంలో కొత్తగూడెంలో ని వారి ఇంటిని తగులబెట్టారు. ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్న స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ.10 వేల బహుమతి ఇస్తామని నిజాం ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ పోరాటం విరమణ అనంతరం కూడా ఆమె కమ్యూనిస్టు పార్టీలో కొనసాగారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీనంగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ విస్తరణ కోసం పనిచేశారు. ఉద్యమంలోనే నూతనకల్ మండలం మామిళ్లమడవకు చెందిన పోరాటయోధు డు మల్లు వెంకటనర్సింహారెడ్డి(వీఎన్)ని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సీపీఎం కీలక నేతలుగా మారా రు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)లో స్వరాజ్యం కీలకనేతగా వ్యవహరించారు. 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మిర్యాలగూడ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓట మి పాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె భర్త వెంకటనర్సింహారెడ్డి 2004 డిసెంబర్ 4న అనారోగ్యంతో మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారు డు డాక్టర్ మల్లు గౌతమ్రెడ్డి, చిన్న కుమారుడు, న్యా యవాది మల్లు నాగార్జున్రెడ్డి, కోడలు మల్లు లక్ష్మి కూడా సీపీఎంలో వివిధ హోదాలో ్లపనిచేస్తున్నారు. స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ కుటుంబం వ్యాపార రంగంలో నిమగ్నమైంది.
మల్లు స్వరాజ్యం 1931లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలోని భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ.. శ్రామికవర్గం కోసం జీవితాన్ని అంకితంచేశారు. ఆమె తల్లిదండ్రులు భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు వందల ఎకరాల భూములు ఉండేవి. రష్యన్ రచయిత మాక్సిం గోర్కి రాసిన అమ్మ నవలను పదేండ్ల వయసులోనే చదివి, ప్రభావితురాలయ్యారు. ఆనాటి సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. 5వ తరగతి వరకు చదువుకొన్న ఆమె.. తన సోదరుడు, మిర్యాలగూడ మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రోత్సాహంతో చిన్న వయసులోనే పోరుబాటపట్టారు. రజాకార్లు, భూస్వాముల ఆగడాలపై గళమెత్తారు. 1945-48 వరకు సాగిన సాయుధ పోరాటంలో తన 16వ ఏటనే తుపాకీ చేతపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.