బేగంపేట, సెప్టెంబర్ 12 : ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డులోని రూబీ హోటల్ కింది అంతస్థులో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన ప్రకారం..రాత్రి 10 గంటల సమయంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనంలోని మూడు అంతస్థులకు వ్యాపించాయి. రూబీ హోటల్లోనే లాడ్జి కూడా ఉండటంతో కొందరు భయంతో బాత్రూమ్ కిటికీల నుంచి పైపులు పట్టుకొని కిందకు దిగగా, మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో 23 మంది వరకు ఉన్నారు.
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లో ఓ వాహనం బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. రాత్రి 12 గంటల వరకు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాద బాధితులను గాంధీ, యశోద దవాఖానలకు తరలించారు. వీరిలో ఏడుగురు మృతి చెందినట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. లాడ్జిలో ఎక్కువ శాతం పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పరిశీలించారు.