అమ్రాబాద్/హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్టు అధికారులు అంచనా వేశారు.
అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. కొండపై అడవిలో మంటలు చెలరేగడం, ఆయా ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం వల్ల మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. ఈ అగ్నిప్రమాదంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో ఆరా తీశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు నల్లమల అటవీ ప్రాంతంలోని జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.