కరీంనగర్ : ఓ 80 ఏండ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వృద్ధురాలిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మానకొండూరు మండల కేంద్రంలోని సంజీవ్ నగర్కు చెందిన మాధవమ్మ ప్రమాదవశాత్తు తన ఇంటి సమీపంలోని బావిలో పడిపోయింది. తల్లి బావిలో పడటాన్ని గమనించిన కుమారుడు రవీందర్ ఉదయం 6:10 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వృద్ధురాలిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఫైర్మెన్ జీ ధర్ము తాళ్ల సాయంతో బావిలోకి దిగి, వృద్ధురాలిని ప్రాణాలతో బయటకు తీశారు. మాధవమ్మను ప్రాణాలతో కాపాడిన మానకొండూరు ఫైర్ సిబ్బందిని జిల్లా ఫైర్ ఆఫీసర్ టీ వెంకన్న అభినందించారు.