RTC Bus Fire Accident | తిమ్మాపూర్, జూన్ 21: కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. బస్సు అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి రాగానే షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఇది గమనించి డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సు డోర్తో పాటు ఎమర్జెన్సీ గేట్లను ఓపెన్ చేసి ప్రయాణికులను వెంటనే బస్సులో నుంచి బయటకు పంపించేశారు.

Karimnagar Rtc Bus Fire2
ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపిన తర్వాత బస్సులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయ్నతించారు. కానీ అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో అదుపులోకి రాలేదు. దీంతో ఐదు నిమిషాల్లో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరకగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
