Fire Accident | హైదరాబాద్ సిటీబ్యూరో/అబిడ్స్/సుల్తాన్బజార్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలో అనధికార కెమికల్ గోడౌన్లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి 9 మంది దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరో 21 మందిని రక్షించారు. రోడ్డు పై కాల్చిన పటాకుల నిప్పు రవ్వలు కెమికల్ గోడౌన్లలోకి దూసుకెళ్లడం లేదా, గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నాంపల్లి బజార్ఘట్లోని తన అపార్టుమెంట్ గ్రౌండ్ఫ్లోర్లో వ్యాపారి రమేశ్కుమార్ జైస్వాల్ ప్లాస్టిక్, ఫైబర్ షీట్స్, కలర్లో కలిపే మిథైల్ బెంజిన్తో కూడిన పెట్రోలియం స్వభావాన్ని కలిగి ఉన్న కెమికల్ డ్రమ్లను నిల్వ చేస్తున్నా డు. అనధికారంగా గోడౌన్ నిర్వహిస్తున్నాడు.
ఈ సామగ్రిని హోల్సేల్గా వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు. నాలుగో అంతస్థులోని ఫ్లాట్లను ఎనిమిది కుటుంబాలకు అద్దెకు ఇచ్చా డు. కుటుంబాల వాహనాలను కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ చేస్తారు. ఉదయం 9.30 సమయంలో గ్రౌండ్ఫ్లోర్ నుంచి పొగలొచ్చా యి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఘటనా స్థలికి ఫైరింజన్లతో చేరుకున్నారు. మం టలు ఆర్పివేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రౌండ్ఫ్లోర్లో మండే స్వభావం ఉన్న రసాయన డ్రమ్ములు ఉండటంతో మంటలు వేగం గా వ్యాపించాయి. పై అంతస్థులో నివాసముంటున్న కుటుంబాలకు కింద ఏదో ప్రమాదం జరిగిందని గుర్తించి.. బయటకు వచ్చే సరికే గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా మంటలు వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి.
మొదటి అంతస్థులో ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా అందరూ బయటకొచ్చారు. ఆపై అంతస్థులో ఉన్నవారు మంటలు దాటుకొని కిందకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పుతూనే, మరో పక్క పైఅంతస్థులో చిక్కుకున్న వారిని నిచ్చెనల సహాయంతో రక్షించారు. అగ్నిమాపకశాఖ, జీహెచ్ఎంసీ రెస్క్యూ ఆపరేషన్లో 21 మందిని కాపాడారు. అప్పటికే పొగ అపార్టుమెంట్ మొత్తం వ్యాపించింది. ప్రమాదంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకోవడంతో ఐదుగురు ఇండ్లలోనే కుప్పకూలిపోయారు. మరో నలుగురు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ పొగ పీల్చుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లి మంటల్లో చిక్కుకొని మృతి చెందారు.
రిటైర్డ్ డాక్టర్ ఎండీ జాకీర్ హుస్సేన్ (66), ఉపాధ్యాయురాలైన ఆయన భార్య నికత్ సుల్తానా (55), వ్యాపారి ఎండీ ఆజమ్ (57), ఆయన భార్య రహమాన్ సుల్తానా (50), కొడుకు హసెబుర్ రహమాన్ (32), కూతురు ఫైజా (26) సమీనా ఉన్నారు. మరో కుటుంబంలో ముక్రమ్ భార్య తహురా ఫర్హానా(35) ఆమె కూతుళ్లు తరోబ (13), మన్హ (6) ఉన్నారు.
అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర తిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలిపారు. తక్షణమే పటిష్ట సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బజార్ఘాట్లో జరిగిన అగ్ని ప్రమా ద ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ఆయన ఘటనాస్థలిని సందర్శించారు. ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పన ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాద ఘటన స్థలిని హోంమంత్రి మహమూద్ అలీ సందర్శించారు. అగ్ని ప్రమాదానికి ఇంటి యజమాని రమేశ్ జైస్వాల్ కారణమని, ఆయనపై కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. అనధికారికంగా అపార్టుమెంట్లో కెమికల్ గోడౌన్ నిర్వహిస్తున్న రమేశ్ జైస్వాల్పై 304 పార్ట్ 2 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.