ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
డిచ్పల్లి, మే 12 : తెలంగాణ విశ్వవిద్యాలయ మాజీ వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తన సామెతలు, వాక్చాతుర్యంతో ఎందరినో చైతన్యపరిచి సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెదిలారు. కరోనా మహమ్మారి బారినపడి పది రోజులుగా చికిత్స పొందారు. నెగెటివ్ వచ్చినప్పటికీ గుండెపోటుతో మృతిచెందారు. వరంగల్కు చెందిన సాంబయ్య తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీగా 2016 జూలై 25న బాధ్యతలు చేపట్టి 2018 జూలై 24న పదవీ విరమణ పొందారు. ప్రొఫెసర్ సాంబయ్య మృతిపట్ల ముఖ్యమంత్ర కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణ నుడికారానికి, దళిత బహుజన సాంస్కృతికతకు నిదర్శనంగా నిలిచిన సాంబయ్య మరణం విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రొ. సాంబయ్య తనతో కలిసి పనిచేసిన సందర్భాలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలిపారు. సాంబయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం తెలిపారు.