కూలీ బిడ్డకు ఎంబీబీఎస్ సీటు
ఫీజు కట్టలేని స్థితిలో కుటుంబం
దాతల సాయం కోసం ఎదురుచూపు
పెద్దపల్లి, మార్చి 30 : సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. నీట్లో సీటు సాధించినా.. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు ఫీజు చెల్లించే స్థితిలో లేకపోవటంతో ఆ చదువుల తల్లి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లికి చెందిన కొత్తపల్లి చంద్రయ్య-స్వరూప దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. రెండో కూతురు భవాని రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సీవోఈ టీఎస్డబ్ల్యూఆర్ఎస్లో ఇంటర్ చేస్తూనే నీట్ కోచింగ్ తీసుకొని పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించింది. నానా తంటాలు పడి లక్ష రూపాయలు చెల్లించి ఓ కళాశాలలో చేరింది. ఇంకా పుస్తకాలు, హాస్టల్ ఫీజుల కోసం లక్షల్లో చెల్లించే పరిస్థితి లేక భవాని కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నది. దాతలు స్పందించి తమ కూతురు చదువుకు సాయమందించాలని కోరుతున్నారు.
డాక్టర్ కావడం నా కల
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలగన్న. అదే లక్ష్యంతో కష్టపడి చదవి సీటు సాధించా. నా చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తాయని ఎన్నడూ అనుకోలేదు. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాల్లోనే చదివా. ఎక్కడా డబ్బు అవసరం రాలేదు. ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ చదవాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. మా అమ్మానాన్నలకు అన్ని డబ్బులు పెట్టి చదివించే స్థోమత లేదు. దాతలు సాయం చేస్తే చదువుకుంటా. నా చదువు పూర్తయ్యాక వారి రుణం తీర్చుకుంటా. సాయం చేయండి ప్లీజ్.
– కొత్తపల్లి భవాని, మెడికల్ విద్యార్థిని.
కొత్తపల్లి భవానీ బ్యాంక్ అకౌంట్ నంబర్ 122712010000919,
ఐఎఫ్ఎస్సీ కోడ్ UBIN0812277, యూనియన్ బ్యాంక్, సుల్తానాబాద్ బ్రాంచ్, పెద్దపల్లి. ఫోన్ : 8341970197