Congress | (ఎక్కల్దేవి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ప్రతినిధి) (హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పింఛన్లతో గౌరవప్రదమైన జీవితాలను గడుపుతున్న వృద్ధులు.. రైతుబంధుతో సాగును ‘పండుగ’లా మార్చుకున్న అన్నదాతలు.. కల్యాణలక్ష్మితో మురిసిపోతున్న యువతులు.. కుటుంబ పెద్ద దూరమైన ఒంటరి మహిళలకు నేనున్నానంటూ సర్కారు ఇస్తున్న వితంతు పింఛన్ల భరోసా.. అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం.. నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్య.. 24 గంటల కరెంటు.. రైతు రుణమాఫీ.. ఇంటింటికీ నల్లా నీళ్లు, రోడ్లు, మౌలిక వసతులు.. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఎన్నెన్నో పథకాలతో పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా అన్నిచోట్లా సంక్షేమం వర్ధిల్లుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం తమ జీవితాలకు చుక్కానిలా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వేలంలో పోటీపడ్డట్టుగా ప్రతిపక్షాలు ఇస్తున్న హామీలు నీటి మీది రాతలేనని తేల్చి పారేస్తున్నారు. సోషల్మీడియాలో కాంగ్రెస్వైపు వీస్తున్నదంతా ఒట్టి బుర్ర గాలేనని కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలపై సామాన్యులు ఏమనుకొంటున్నారనేది తెలుసుకొనేందుకు ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. హైదరాబాద్ శివారు నుంచి మొదలుకుని.. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల వరకు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొన్నది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవటం కనిపించింది.
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. బర్రెలు కాసే నిరక్షరాస్యులు కూడా రాజకీయాలపై అద్భుతంగా విశ్లేషణ చేయగలరు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలపై గ్రామాల్లో చర్చ తీవ్రంగా సాగుతున్నది. గత పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. ఇప్పుడు రాష్ట్రంలో కనీసం ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందని వారు ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ ప్రచారం చేసుకొంటున్న ‘గాలి’ అంతా ఉత్తదేనని ్రఅభిప్రాయాలను బట్టి తెలుస్తున్నది. పథకాలు, అభివృద్ధి విషయంలో పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్టు స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ బలపడిందన్న వాదనతో రైతులెవరూ ఏకీభవించటంలేదు.
ఈసారి ఓటర్లలో అత్యధికులు ఎవరికి ఓటేయాలో ముందుగానే నిర్ణయించుకొన్నట్టు వారితో మాట్లాడిన తర్వాత అర్ధమైంది. అయితే, చాలామంది క్షేత్రస్థాయిలో వాస్తవాలు చెప్తున్నప్పటికీ.. వారి పేర్లను, ఫొటోలను ప్రచురించడానికి ఒప్పుకోలేదు. గ్రామా ల్లో ఈ మధ్య కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల బెదిరింపులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, ఓటు వేసేవాళ్లకే వేస్తామని.. కానీ, అనవసర గొడవలు మెడకు చుట్టుకోవటం ఇష్టంలేదని చెప్తున్నారు. మెదక్ సమీపంలో ప్రధాన రహదారిపై జామకాయలు అమ్ముకునే మహిళతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడింది. తన భర్త రెండేండ్ల క్రితం చనిపోయారని, అందుకు రైతుబీమా కింద రూ.5 లక్షలు వచ్చినట్టు ఆమె చెప్పారు. రైతుబంధు డబ్బులు సమయానికి వస్తున్నాయని తెలిపారు. తాను బీఆర్ఎస్ వెంటే నడుస్తానని చెప్తూనే.. తన పేరు, ఫొటో ప్రచురిస్తే గ్రామంలో ఇబ్బంది అయితదని చెప్పారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోని నార్నూర్ మండలంలోని ఒక తండాకు చెందిన గిరిజన రైతు (60) తాను.. 2004 నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వెంటే నడుస్తున్నానని వెల్లడించారు. 5 ఎకరాల వ్యవసాయ భూమికి రైతుబంధు వస్తున్నదని, కల్యాణలక్ష్మితో కూతురి పెండ్లి చేశానని, గిరి వికాసం పథకంలో భాగంగా రూ.5 లక్షలతో బోరు వేసి, కరెంటు మోటర్ బిగించినట్టు తెలిపారు. మంచినీరు, కరెంట్, వైద్యం, విద్య, ఇతర పథకాలు బాగున్నాయని వెల్లడించాడు. బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్లో కంప్యూటర్ సెంటర్ను నడుపుకుంటున్న ప్రవీణ్ (34) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో రోడ్లు, మంచినీళ్లు, కరెంటు, వైద్యం చాలా మెరుగయ్యాయని తెలిపాడు.
14 ఏండ్ల కింద దుబాయ్ పోయిన. తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంటు తో నా భార్య 3 ఎకరాలను సాగు చేసేది. నేను దుబాయ్ నుంచి పంపే డబ్బులు పంపేవాడిని. అదంతా కలిపి ఇద్దరి బిడ్డల పెండ్లిళ్ల్లు చేశాను. మొన్ననే రూ.86 వేల రైతు రుణం మాఫీ అయ్యింది. 3 ఎకరాలకు రైతు బంధు వస్తున్నది. కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంట్తో నాకు బేఫికర్. మళ్లా కేసీఆరే 100 శాతం గెలుస్తడు.
– కేతావత్ కిషన్, బెల్యానాయక్ తండా, మల్లారం బాన్సువాడ నియోజకవర్గం
తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టనష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించడం సంతోషకరం. అంతకుముందే నేను రిటైర్ అయిన. అయినా నాకు అసంతృప్తి లేదు. నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దీనికి రైతు బంధు వస్తున్నది. పత్తి పండిస్తున్నాను. పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, కరెంటు బాగున్నాయి. కేసీఆర్ను మళ్లీ గెలిపిస్తే మరింతగా మంచి చేస్తాడనే నమ్మకం ఉన్నది. అందుకే కేసీఆర్ కావాలి.. కేసీఆర్ రావాలి.
-జెట్టె సుధాకర్, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్, రామాయి, ఆదిలాబాద్ నియోజకవర్గం
నా కొడుకులు, బిడ్డలు సరిగా చూడకపోయినా.. నా పెద్దకొడుకులాంటి కేసీఆర్ ఇచ్చే రూ.2016 పింఛన్తో తింటున్నా, మంచిగా బతుకుతున్నా. నూటా మూడేండ్ల వయస్సులోనూ బతికి ఉన్నానంటే అది నా బిడ్డ కేసీఆర్ ఇచ్చే పింఛనే కారణం. నాకెవ్వరూ దిక్కులేరు. కేసీఆరే దిక్కు. ఆయననే దీపం.. ఆయనదే అన్నం. ఆయనదే ధీమా.. ఆయనకే మా ఓటు. ఆయన్నే గెలిపియ్యాలని అందరికీ చెప్తున్నా. మీరే గెలవాలి కొడుకా. ఎవ్వరొచ్చినా మాకు అన్నం పెట్టరు. మీరు తెలంగాణ తేవట్టే మేము బతుకుతున్నాం. మీరే రావాలి కొడుకా.
-బిల్ల ప్రమీల (103), నస్పూర్, మంచిర్యాల
నాకు చిన్నప్పుడే పెండ్లయ్యింది. మా ఆయన డ్రైవర్గా పనిచేసేవాడు. నా కూతురు చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. అప్పటి నుంచి అంటే.. దాదాపు 35 ఏండ్ల నుంచి నాకు వితంతు పింఛను వస్తున్నది. మొదట్లో రూ.50 పింఛన్ ఇచ్చేవారు. ఆ తరువాత దానిని రూ.75కు.. ఆపై రూ.200కు పెంచారు. తెలంగాణ వచ్చినంక రూ.2016 ఇస్తున్నారు.
– ఠాగూర్ ప్రేమల (60), రాజంపేట, ఆసిఫాబాద్ నియోజకవర్గం
మా సొంతూరు తాండూరు.. క్యాబ్ డ్రైవర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నా. నేను మొదటి నుంచి కాంగ్రె స్ అభిమానిని. కానీ కాంగ్రెస్ నుంచి గెలిపించిన నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు నేను బీఆర్ఎస్కు మద్దత్తుగా నిలవాలనుకుంటున్నా. కరెంటు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు, కల్యాణలక్ష్మి.. ఇలా చాలా పథకాలు ప్రజలకు అండగా ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం.
– కాకి వెంకటేశ్, క్యాబ్ డ్రైవర్, హైదరాబాద్