హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): అందరిలో క్యాన్సర్ కణాలు పుడతాయి. వాటిని సహజ కణాలు తుదముట్టిస్తాయి. ఇది శరీరంలో సాధారణంగా జరిగే ప్రక్రియే. ఆ సహజ కణాలను తప్పించుకొని క్యాన్సర్ కణాలు ఎలా బీభత్సం సృష్టిస్తాయి? అసలు క్యాన్సర్ కణాలపై సాధారణ కణాలు ఎలా దాడి చేస్తాయి? వాటికి భౌతిక, రసాయన సిగ్నల్స్ ఎలా అందుతాయని హైదరాబాద్కు చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలు పరిశోధన చేసి పలు ఆసక్తికర అంశాలను గుర్తించారు. ఈ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ కణాలపై శరీరం దీటుగా స్పందించేలా చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి, క్యాన్సర్ కణాలకు మూలాధారం.. ఎపిథెలియల్ కణజాలం. 80 శాతం క్యాన్సర్లు ఈ కణజాలంలోనే పుడతాయి. ఎపిథెలియల్ కణజాలం శరీరంలోని అవయవాలకు రక్షణ కవచంలా ఉండే పొర. ఇది క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేస్తాయి. కానీ, కొన్ని కణాలు ఎపిథెలియల్ కణాల నుంచి తప్పించుకొని, పునరుత్పత్తి జరిగి ఒక సమూహంగా ఏర్పడతాయని పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో ఎపిథెలియన్ కణాల సంఖ్య తగ్గి, క్యాన్సర్ కణాల సంఖ్య పెరుగుతూ శరీరమంతా వ్యాపిస్తుందని అధ్యయనంలో గుర్తించినట్టు వెల్లడించారు.
క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు ఒక సహజ (సాధారణ) కణం మరో కణంతో కలిసి సమూహంలా ఏర్పడి క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయి. ఆ సమయంలో సాధారణ కణాలు ఎలా భౌతిక, రసాయన సందేశాలను అందుకొంటాయని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఎపిథెలియల్ కణాల మధ్య ఎక్స్ట్రా సెల్యూలర్ మ్యాట్రిక్స్ (ఈసీఎమ్) ఉంటుందని.. ఇదే భౌతికంగా, రసాయనికంగా కణజాలంలోకి కణాలకు మద్దతుగా నిలుస్తుందని గుర్తించారు. ఈసీఎమ్ గట్టిపడినప్పుడు సాధారణ కణాలు క్యాన్సర్ కణాలతో పోరాడలేవని, అదే మృదువుగా ఉంటే క్యాన్సర్పై దాడి చేస్తాయని అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. ఈసీఎమ్ తీరుకు ‘ఫిలమిన్’ ప్రొటీన్ కారణమని, కణాల మధ్య తక్కువ ఫిలమిన్ ఉంటే ఈసీఎమ్ గట్టిగా, ఎక్కువ ఫిలమిన్ ఉంటే మృదువుగా మారుతుందని వివరించారు. సాధారణ కణాల మధ్య ఐక్యతను ఫిలమిన్ బలపరిస్తే.. దానికి సీడీసీ 42 సహాయం అందిస్తుందని వెల్లడించారు. మొత్తంగా ఈసీఎమ్ క్యాన్సర్ కణాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
మనిషి ఎదిగేప్పుడు కణాల విభజన సక్రమంగా ఉండాలి. అంటే కణాల విభజన అనేటిది సమానంగా జరగాలి. అలా కాకుండా కొంతమందిలో కణాలు అసంబద్ధంగా ఎదుగుతాయి. ఈ రకమైన కణాల ఎదుగుదలలో ఏర్పడిన లోపాన్నే క్యాన్సర్ అంటారు. వంశపారంపర్యంగా, పొగాకు ఉత్పత్తులు, వాతావరణ కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్ కణాలు పుడతాయని వైద్యనిపుణులు వెల్లడించారు.