హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభు త్వం ఉన్నదని, దేశంలో ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆదివారం హైదరాబాద్లో హరీశ్రావు ఆవిష్కరించి మాట్లాడారు. డైరీ ఆవిష్కరణ అంటే తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తుకొస్తున్నాయని, అప్పుడు జనవరి నెలంతా డైరీ ఆవిష్కరణలతో గడిచేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఉద్యోగాల భర్తీ శరవేగంగా సాగుతున్నదని, టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమైదని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, సాధించుకొన్న రాష్ట్రంలో ఉద్యోగుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘం నేతలు కొన్ని సమస్యలు చెప్పారని, త్వరలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కలిసి సమావేశం నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈహెచ్ఎస్ గురించి సీఎం కేసీఆర్తో చర్చించగా గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పురుషోత్తంరెడ్డి, పరశురాం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, జగన్, మూర్తి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.