హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో విడత రైతుల పంట రుణాల మాఫీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ దఫాలో రూ.50 వేల లోపున్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని వెల్లడించారు.ఈ రుణమాఫీతో దాదాపు ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తం రూ.2,006 కోట్లు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీ అమలుపై మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి శుక్రవారం బీఆర్కే భవన్లో 42 బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. రుణమాఫీపై ఈ నెల 1న క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే రుణం మాఫీ అయినట్టు సీఎం కేసీఆర్ పేరుతో లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. దీంతోపాటు ‘కొత్త పంట రుణానికి మీరు అర్హులు’ అని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలని స్పష్టంచేశారు. బ్యాంకులు సైతం రైతులకు రుణం మాఫీ అయినట్టు సీఎం కేసీఆర్ పేరుమీద స్పష్టమైన సందేశం పంపాలని ఆదేశించారు. రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, వారి ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని వేరే ఖాతా లేదా పద్దు కింద జమ చేయవద్దని సూచించారు. లబ్ధిదారుల ఖాతాలను జీరో చేసి అర్హులందరికీ కొత్తగా పంట రుణం ఇవ్వాలని ఆదేశించారు.
రుణమాఫీ చెల్లింపులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. బ్యాంకులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రుణ మాఫీ మొత్తం వారికి చేరవేయాలని సూచించారు. క్యాబినెట్ నిర్ణయం మేరకు రుణమాఫీ డబ్బును జమచేస్తున్నందుకు వ్యవసాయశాఖ తరఫున సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్థిక, వ్యవసాయశాఖల ఉన్నతాధికారులు, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
రెండోదశ రుణమాఫీ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. మొదటి దశలో రూ. 25వేల వరకు మాఫీ చేయగా, ఇప్పుడు రూ. 50వేల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్టు పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1850కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
2022 వరకు రుణ ఉపశమన కమిషన్ గడువు పొడిగింపు
రాష్ట్ర ఉపశమన కమిషన్ గడువును 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి గత మార్చి 13వ తేదీతోనే కమిషన్ గడువు ముగిసింది. కమిషన్ గడువును ఏడాది పొడిగించడం పట్ల చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, సభ్యులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2018లో కమిషన్ను ఏర్పాటుచేసింది. చిన్న, సన్నకారు రైతులపై అప్పులిచ్చిన బ్యాంకులు లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయకుండా, స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా విచారణ జరిపి, వారిని రుణవిముక్తులను చేసే లక్ష్యంతో కమిషన్ ఏర్పాటయ్యింది. ఐదెకరాల్లోపు భూమి కలిగి (ఎస్టీలైతే పది ఎకరాల్లోపు) అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్న రైతులు హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద ఉన్న కమిషన్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.