హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. 657 ఏఈఈ, 113 ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్వో ఇతర పోస్టుల భర్తీకీ అనుమతి ఇచ్చారు.
ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులతో పాటు పోలీస్, రవాణా, అటవీ, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, పోలీస్ నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో 1,433 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనుండగా.. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.