హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకున్నది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎదుట గురువారం తుది విచారణ జరుగనున్నది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి తుది వాదనలు జరుగనున్నాయి.
తొలుత ఉదయం 11 గంటలకు పిటిషనర్, కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, రెస్పాండెంట్ కడియం శ్రీహరి మధ్య వాద ప్రతివాదనలు జరుగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పిటిషనర్ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డి, రెస్పాండెంట్ దానం నాగేందర్ మధ్య వాదనలు జరుగనున్నాయి. ఆ తరువాత ఒంటిగంటకు పిటిషనర్ ఆలేటి మహేశ్వర్రెడ్డి, రెస్పాండెంట్ దానం నాగేందర్ తుది వాదనలు ఉంటాయి.
ఈ విచారణలో భాగంగా ఉభయ పక్షాలవారు తమ తుది వాదనలను వినిపించనున్నారు. కేవలం మౌఖిక వాదనలే కాకుండా, సంక్షిప్తంగా లిఖితపూర్వక వివరణలను కూడా సమర్పించాలని స్పీకర్ కార్యాలయం స్పష్టంచేసింది. ఈ విచారణ అనంతరం స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇరుపక్షాల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తిచేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో గురువారంలోగా ఇరువైపులా వాదనలు ముగించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ తుది విచారణను గురువారానికి వాయిదా వేస్తూ షెడ్యూల్ జారీచేశారు.