Police Dog | నల్లగొండ : అనారోగ్యంతో మరణించిన పోలీసు జాగిలానికి అధికారిక లాంఛనాలతో పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు. నల్లగొండ జిల్లా పోలీసు శాఖకు జాగిలం పింకి అందించిన సేవలు మరువలేనివి అని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నేర పరిశోధనలో సాటి లేని జాగిలం, వాసన పసిగట్టిందంటే వదిలి పెట్టని నైజం అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు వెన్ను దన్నుగా నిలిచి దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అందించి అనారోగ్య కారణంగా ఈ రోజు మరణించడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో ఐఐటీ మొయినాబాద్లో 9 నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజుతో పాటు శిక్షణ పొంది శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.
పింకీ సాధించిన ఘనతలు:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విధినిర్వహణలో భాగంగా నల్లగొండ 1 టౌన్ పరిధిలో బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వేరు చేసిన సంచలన హత్య కేసులో కీలక పాత్ర పోషించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూలకంటి ఇంద్రా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రూ. ఒక కోటి 40 లక్షల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితుల జాడలను కనిపెట్టింది. గుండాల మండలంలోని వంగాల గ్రామంలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం రోజుల తరువాత విషయం తెలుసుకున్న తరువాత ఈ డాగ్తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా పింకీ విధినిర్వహణలో చేసిన సేవలు మరువలేనివి.
విధి నిర్వహణలో అనేక సేవలు అందించిన పింకీ జాగిలం పార్థివదేహానికి జిల్లా ఎస్పీ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, ఆర్ఎస్ఐ రాజీవ్, డాగ్ హ్యాండ్లర్ నాగరాజు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కరుణాకర్, సంపత్, సతీష్, గోపాల్, మహేంద్ర, నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.