మిర్యాలగూడ టౌన్, మార్చి 10 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సినీ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) శనివారం రాత్రి మృతి చెందారు. రాంబాబు మొదట ప్రజానాట్యమండలి కళాకారుడిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడి సినీ నిర్మాతగా మారారు. ఆయనకు భార్య సంధ్యారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. సినీ నటుడు అల్లరి నరేశ్తో గోపి (గోడ మీద పిల్లి), లక్ష్మీపుత్రుడు సినిమాలు తీశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఇటీవల హైదరాబాద్లోని ఓ దవాఖానలో చేర్పించారు. అమెరికాలో ఉంటున్న చిన్నకుమార్తె శుక్రవారం మధ్యా హ్నం 12 గంటలకు హైదరాబాద్కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల తరువాత వెంటిలేటర్ తొలగించారు. అదేరోజు రాత్రి మిర్యాలగూడకు తీసు కురాగా కొనఊపిరితో ఉన్న ఆయన్ను మరో ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తదితరులు రాంబాబు మృతదేహానికి నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం పెద్దకుమార్తె అంజు చేతుల మీదుగా హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.