పెన్పహాడ్, జూన్ 27 : సూర్యాపేట జిల్లాలో బలగం సినిమా సీన్ రిపీట్ అయ్యింది. మటన్ ముక్కల కోసం పెండ్లి మండపంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం ధర్మాపురంలో గురువారం చోటుచేసుకోగా శుక్రవారం కేసు నమోదైంది. వివరాలు ఇలా.. ధర్మాపురం గ్రామానికి చెందిన అమ్మాయికి, అనంతారానికి చెందిన అబ్బాయితో ఈ నెల 25న మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాలులో వివాహం జరిగింది. భోజన సమయంలో మటన్ ముక్కలు వేయలేదని వరుడి బంధువులు లొల్లి చేశారు.
‘మేం పెండ్లికొడుకు బంధువులం. భోజనానికి వచ్చే సరికి మటన్ కూరలో మురుసు బొక్కలు వేయలేదు. అసలు లంచ్ సరిగ్గా వడ్డించడం లేదు’ అని పెండ్లికూతురు బంధువులతో వాదనకు దిగారు. ‘భోజనానికి ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఉన్నదాంట్లో సర్దుకోవాలి. ఇలా గొడవ చేయడం ఏమిటి?’ అని పెండ్లికుమార్తె బంధువులు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం కాస్త పెద్దదై ఇరువర్గాల వారు ఒకరినొకరు భౌతిక దాడులకు దిగారు. పెండ్లి మండపంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. బంధువులంతా చెల్లాచెదురయ్యారు. పెండ్లి వేడుక కాస్త రణరంగంగా మారడంతో ఇరుపక్షాల వారు పెన్పహాడ్ పోలీస్స్టేషన్కు పరుగులు తీసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై గోపీకృష్ణ ఇరువర్గాలపై శుక్రవారం కేసు నమోదు చేశారు. బంధుత్వాలు కలుపుకోవాల్సిన చోట.. మటన్ ముక్కల కోసం కొట్టుకొని పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.