Minister Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వలసలు వాపస్ రావడమే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని తెలిపారు. నాడు తెలంగాణ పట్ల విషం చిమ్మినోళ్లే నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారని చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా తోర్నాలలో రూ.50 కోట్లతో నిర్మించనున్న సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణ మీద ప్రేమ చూపలేదని, కానీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి పాజిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పారు. ఒకనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదెకరాలు దొరికేదని, నేడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఐదెకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. డాక్టర్ల ఉత్పత్తిలోనూ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచామని, రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల మంది డాక్టర్లు ఉన్నారని వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎక్కువ అవయవమార్పిడి శస్త్రచికిత్సలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయని తెలిపారు.
ఈ నెల నుంచే పెంచిన డైట్ చార్జీలు
విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మెస్చార్జీలు పెంచారని మంత్రి హరీశ్రావు చెప్పారు. డైట్ చార్జీలను ఎనిమిదో తరగతి వరకు రూ.1200కి, 8 నుంచి 10 తరగతి వరకు రూ.1400కి, ఇంటర్ ఆపైన రూ.1875కి పెంచారని, ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు. 2014కు ముందు రెసిడెన్షియల్ విద్యకు రూ.970 కోట్లు ఖర్చు పెడితే నేడు రూ.నాలుగువేల కోట్లు ఖర్చుచేస్తున్నామని వెల్లడించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నవారి సంఖ్య 1.94 లక్షల నుంచి 7.50 లక్షలకు పెరిగిందని తెలిపారు. నాడు నాలుగు మెడికల్ కళాశాలలు ఉంటే నేడు 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయని వివరించారు. విభిన్నవర్గాల ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, పని ఎక్కువ చేస్తున్నా చెప్పుకునేది మాత్రం తక్కువ ఉన్నదని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో మంత్రి ఆత్మీయ పలకరింపు
సిద్దిపేట బాలికల విద్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మంత్రి హరీశ్రావు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ‘సూల్ ఎలా ఉన్నది? సిద్దిపేట అభివృద్ధిలో ఏది నచ్చింది? రన్నింగ్లో ప్రైజ్ తెచ్చుకుంటారా? భవిష్యత్తులో ఏమి చేస్తారు?’ అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. ఆస్మా అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘మా సూల్ని బాగా చేశారు సర్.. బహుత్ అచ్చాహై. బాగా చదువుకొని మంచిపేరు తెస్తాం. సిద్దిపేటలో అన్ని బాగున్నాయి సార్.. కోమటిచెరువు, క్రికెట్ స్టేడియం అన్నీ మంచిగున్నాయ్’ అంటూ సమాధానం చెప్పింది. అభినయ అనే మరో విద్యార్థిని మాట్లాడుతూ.. ‘సూల్ బ్యూటిఫుల్గా ఉన్నది. నేను ఇంట్లో ఉండకుండా హాస్టల్లో ఉండి చదువుకొంటున్నా సార్’ అని తెలిపింది. భవ్యశ్రీ మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇకడ చదువుకొంటున్నా సార్. సూల్ గ్రౌండ్ బాగా డెవలప్ చేశారు’ అని చెప్పింది.
విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్: హరీశ్
స్వరాష్ట్రం సిద్ధించాక ఆదివాసీ, గిరిజనుల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు, మోడువారిన బతుకుల్లో మోదుగుపూల పరిమళాలు, మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు. కుమ్రం భీం నినదించిన జల్, జంగల్, జమీన్ ఆశయాలను నిజం చేశారని గుర్తు చేశారు.