హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి అని కేటీఆర్ సూచించారు.
ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ ఆయిల్ ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ ఫామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. దీంతో పాటు వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలలో ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాలపైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఆహ్వానించారు.
తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటిస్తామన్నారు. ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లతో పాటు మరికొన్ని చోట్ల రాష్ట్రంలో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని కేటీఆర్ అభినందించారు. సిరిసిల్లలో ఫ్యాక్టరీతో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.