కోల్సిటీ, మార్చి 5: 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారందరికీ మార్చి నెల నుంచే జీరో బిల్లు వస్తుందని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మందికి పాత పద్ధతిలోనే బిల్లు వచ్చింది. రెండురోజుల నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు ఏరియాల్లో విద్యుత్తు సిబ్బంది కరెంటు బిల్లులు ఇస్తున్నారు.
వీరిలో కొందరికే జీరో బిల్లులు వస్తుండగా.. ఈ విషయమై విద్యుత్తు శాఖ సిబ్బందిని అడిగితే రేషన్కార్డు, ఆధార్నంబర్ ఎన్రోల్ కాలేదని, అందుకే పాత పద్ధతిలోనే బిల్లు వస్తున్నదని చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో మళ్లీ ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రజాపాలన సభలో దరఖాస్తుతోపాటు రేషన్కార్డు, ఆధార్కార్డులు సమర్పించామని, వాటిని ఏం చేశారని కార్పొరేషన్ సిబ్బందితో కొందరు వాగ్వాదానికి దిగారు.