సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే యావత్తు దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు చేపడుతున్న జ్వర సర్వేను దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ దవాఖానలో కొవిడ్, ఐసీయూ, జనరల్ వార్డులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. కరోనా బాధితులతో స్వయంగా మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేలో రాష్ట్రంలో 3 లక్షలమందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించి, సకాలంలో మెడికల్ కిట్లను అందించి ప్రాథమిక వైద్యసేవలు అందేలా చూశామని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ రేటు తగ్గిందని చెప్పారు. పేషెంట్లు సీరియస్ కాకుండా చూడటంతోపాటు ఆక్సిజన్ అవసరం లేకుండా చూడగలిగామని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులతో ఉదయం, సాయంత్రం అంగన్వాడీ, ఆశవర్కర్లు మాట్లాడుతున్నారని, వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నారని తెలిపారు. మొదటి సర్వే మంచి ఫలితాలు ఇవ్వడంతో రెండో సర్వే చేపడుతున్నామని హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు 5 లక్షల రెమ్డెసివర్ ఇంజక్షన్లు అందించామని, తాలూకా స్థాయిలోని ప్రభుత్వ దవాఖానల్లో కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనేక రాష్ర్టాల్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోయిన పరిస్థితి చూశామని, ముందస్తు చర్యలు తీసుకోవడంతో తెలంగాణలో అలాంటి ఘటనలు జరగలేదని ఆయన తెలిపారు. మంత్రి వెంట కళాశాల ప్రిన్సిపల్ తమిళ ఆరస్, డాక్టర్ కాశీనాథ్, సూపరింటెండెంట్ జయశ్రీ, డీఎంహెచ్ మనోహర్ తదితరులు ఉన్నారు.