ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ నేతల సూచన
చండీగఢ్లో కేసీఆర్కు ఘనసన్మానం
కరీంనగర్ నుంచి హాజరైన మునీందర్
కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబాలకు కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి పంజాబ్ రాజధాని చండీగఢ్లో ఆదివారం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నేషనల్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, సీడ్ డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గౌరిశెట్టి మునీందర్ ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్ పంజాబ్ శాఖ సీఎం కేసీఆర్ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అసోసియేషన్స్కు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కోసం వినూత్న ఆలోచనలతో, విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేయడం దేశ చరిత్రలో లిఖించదగిన విషయమన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న ఈ విప్లవాత్మక విధానాలతో దేశం సర్వతోముఖాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ఇలాంటి పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ను సన్మానించిన వారిలో పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్కుమార్ రస్సేవత్, నేషనల్ సెక్రెటరీ సురేందర్సింగ్ బర్వాల్, పంజాబ్ జనరల్ సెక్రెటరీ కృష్ణకుమార్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కుల్వీర్ సింగ్ స్రన్ తదితరులు ఉన్నారు.