నెల క్రితమే హైదరాబాద్లో తొలి యూనిట్ ప్రారంభం
ఇప్పుడు మరో యూనిట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ నిర్ణయం
దావోస్లో మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా తమ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. నెల క్రితమే హైదరాబాద్లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న రెండు-మూడేండ్లలో రూ.500 కోట్ల (60 మిలియన్ యూరోల) పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు తెలంగాణను ఎంచుకొన్నట్టు ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో తెలిపారు.
క్రోన్, అల్సరేటివ్ కోలైటిస్ లాంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే పెంటసా ఔషధాన్ని తెలంగాణలో ఉత్పత్తి చేసేందుకు నూతన ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా.. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తున్నది. వీటికి అదనంగా హైదరాబాద్లో తన ఫార్ములేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది.
తెలంగాణలో అత్యంత సానుకూల వాతావరణం: కేటీఆర్
ఫెర్రింగ్ ఫార్మా విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇటీవలే ఈ కంపెనీ యూనిట్ను ప్రారంభించానని, నెల రోజులు తిరక్కుండానే ఈ కంపెనీ మరో 60 మిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనుండటం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పేందుకు ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయమే నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకు సైతం తెలంగాణలో అత్యంత సానుకూల వాతావరణం ఉన్నదన్న విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాల వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.