కోనరావుపేట, మే 20: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం రైతుల ప్రాణాలు తీస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లగొల్లపల్లికి చెందిన మహిళారైతు ఎర్రగడ్డం లచ్చవ్వ (65) కొనుగోలు కేంద్రం చుట్టూ తిరిగీతిరిగీ వడదెబ్బతో మృతిచెందింది. నాలుగెకరాల్లో వరి సాగు చేసిన లచ్చవ్వ, గ్రామంలోని సెంటర్లో నెల రోజుల కింద వడ్లుపోసింది. రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో తల్లడిల్లింది. ప్రతిరోజూ సెంటర్కు వెళ్లడం, వడ్ల దగ్గర పడిగాపులుపడుతూ ఇంటికి వస్తుండేది. సీరియల్ నంబర్ వచ్చిందని, వడ్లు తూకం వేస్తామని నిర్వాహకులు చెప్పడంతో బుధవారం ఉద యం 8 గంటలకు సెంటర్కు వెళ్లింది. తూకం వేయడం మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలకు లచ్చవ్వ భర్త లచ్చిరెడ్డి సెంటర్కు రాగానే, ఆమె ఇంటికి వచ్చింది. వాటర్ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన కుటుంబసభ్యులు దవాఖానకు తరలించే యత్నంచేయ గా, అప్పటికే మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ బొంగు ఆమని కోరారు.