జాతి నిర్మాణంలో ఇంజినీర్లు కీలకం
రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల
బాల్కీ కాలేజీకి రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
కాలేజీలో ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. తన అనుభవాలను పంచుకొన్నారు. తాను సివిల్ ఇంజినీర్ అయినందువల్లే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ తనను భాగస్వామిని చేశారని తెలిపారు. బీకేఐటీ అభివృద్ధి కోసం మంత్రి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మంత్రి వేముల మంచి ఇంజినీరే కాదు.. మనసున్న ప్రజాసేవకుడు కూడా అని బాల్కీ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే కొనియాడారు.