హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడంలో కేంద్రప్రభుత్వం, ఎఫ్సీఐ కపట నాటకాలాడుతున్నాయి. బియ్యం నిల్వకు కొండంత స్టోరేజీ అవసరం ఉంటే పిసరంత స్టోరేజీతో రైతుల జీవితాలతో ఎఫ్సీఐ చెలగాటమాడుతున్నది. ఒకవైపు లారీలకొద్దీ బియ్యం ఎఫ్సీఐ గోదాముల ముందు బారులుతీరి కనిపిస్తుంటే.. ఢిల్లీలో కేంద్రమంత్రులు మాత్రం రాష్ట్రప్రభుత్వమే బియ్యం ఇవ్వటంలేదని అబద్ధాలాడుతున్నారు. రాష్ట్రంలో గత యాసంగిలో కొనుగోలు చేసిన 92 లక్షల టన్నుల ధాన్యం ద్వారా 62 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. ఇంత భారీమొత్తంలో బియ్యాన్ని నిల్వచేసే సామర్థ్యం రాష్ట్రంలో ఎఫ్సీఐకి లేదు. రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాముల సామర్థ్యం అక్షరాలా 5.36 లక్షల టన్నులు మాత్రమే. అదనంగా మరో 10.05 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుంచి లీజుకు తీసుకొన్నది. మొత్తం కలిపినా 15.41 లక్షల టన్నులు మాత్రమే. ఇంత తక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న ఎఫ్సీఐ, 62 లక్షల టన్నుల బియ్యాన్ని ఎక్కడ నిల్వచేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోదాముల సామర్థ్యాన్ని పెంచుకొనే ప్రయత్నం కూడా ఎఫ్సీఐ చేయటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెం దుతుండటంతో ప్రైవేటురంగంలో వేర్హౌస్లు, గోదాములు భారీగా నిర్మాణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 లక్షల టన్నుల నిల్వసామర్థ్యంగల గోదాములు ఖాళీగానే ఉన్నాయి. గోదాముల సామర్థ్యం పెంచాలనుకొంటే సహకరిస్తామని రాష్ట్రప్రభుత్వం ఎఫ్సీఐకి ఇదివరకే చెప్పింది. అయినా ఆ సంస్థలో చలనం కనిపించటంలేదు. కొత్త గోదాములు నిర్మించక, ఖాళీగా ఉన్నవాటిని లీజుకైనా తీసుకోక మొండిగా వ్యవహరిస్తున్నది. నిల్వ సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు సేకరించిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు వేరేప్రాంతాలకు తరలిస్తుండాలి. అప్పుడే గో దాములు ఖాళీ అయ్యి మరికొంత బియ్యాన్ని తీసుకోవటం సాధ్యమవుతుంది. ఎఫ్సీఐ ఆ పనికూడా చేయటంలేదు. బియ్యం తరలించేందుకు నెలనెలా పదుల సంఖ్యలో రైలు వ్యాగన్లు అవసరమైన చోట ఒకటీ, అ రా తీసుకొస్తున్నది. దీంతో ప్రస్తుతం 11 జిల్లాల్లో ఎఫ్సీఐ గోదాముల ముందు 720 లారీలు బియ్యంతో నిలిచి ఉన్నాయని పౌరసరఫరాల సంస్థ తెలిపింది.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై, ఎఫ్సీఐపై గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శాంతకుమార్ కమిటీ కీలక సిఫారసులు చేసింది. భవిష్యత్తులో గోదాములకు కొరత వస్తుందని ముందే అంచనావేసి, ధాన్యం సేకరణ సమయంలో పేదలకు రేషన్కార్డు ద్వారా ఇచ్చే బియ్యాన్ని ఒకేసారి మూడు నెలలకు ఇవ్వాలని సూచించింది. అందువల్ల గోదాములు ఖాళీ అయ్యి, కొత్త సీఎంఆర్ సేకరణ సులువు అవుతుందని పేర్కొన్నది. ఇంత కీలక సిఫారసులను సైతం బీజేపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. అధునాతన గోదాములను నిర్మించాలన్న సూచనను అసలే పట్టించుకోలేదు.