హనుమకొండ: హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు. భీమదేవరపల్లికి చెందిన మాచర్ల కుమారస్వామి, శ్రీకాంత్ తండ్రీ కొడుకులు. కుటుంబకలహాలతో తండ్రి కుమారస్వామిపై.. శ్రీకాంత్ గొడ్డలితో దాడి చేశాడు. అయితే అదే గొడ్డలి అందుకున్న కుమారస్వామి కొడుకుపై ప్రతి దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోఘటనలో జగిత్యాల జిల్లా కేంద్రంలో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో అన్నం చక్రవర్తి (22) అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఆదివారం రాత్రి తన స్నేహితులతో జరిగిన గొడవలే హత్యకు కారణమని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.