దుబ్బాక,ఫిబ్రవరి 23 : తెల్లారితే కొడుకు పెండ్లి…అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువుల వివరాల ప్రకరాం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్(66) విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి. కొంతకాలంగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్కు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతితో ఆదివారం ఉదయం 10 గంటలకు దుబ్బాకలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరగాల్సి ఉంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సత్యనారాయణగౌడ్కు గుండెపోటు వచ్చింది. వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో కుటుంబీకులు, పెండ్లికి వచ్చినవారు శోకసముద్రంలో మునిగిపోయారు. పెండ్లి వాయిదా పడింది.