ఇచ్చోడ(సిరికొండ), ఏప్రిల్ 14: కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మడావి సోనేరావు (50)కు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల పొలంలో కొత్తగా బావి తవ్వించాడు. శుక్రవారం ఉదయం చిన్న కూతురు శైలజ (10)తో కలిసి బావికి పూజ చేసేందుకు వెళ్లాడు. చెంబులో నీళ్లు తీసుకురావడానికి సోనేరావు బావిలోకి దిగడంతో కాలు జారి అందులోనే పడ్డాడు. గమనించిన కొడుకు సూర్యభాను (24) ఈత రాకపోయినా తండ్రిని రక్షించే క్రమంలో అందులో దూకాడు. దీంతో ఇద్దరూ మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బోథ్ దవాఖానకు తరలించారు.