గోవిందరావుపేట, మే 9 : లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రసపుత్ రాజు(45) తన లేగదూడ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో పడింది. మూగ జీవి ఆర్తనాదాలు విని చలించిపోయిన రాజు తాడు కొట్టుకొని బావిలోకి దిగాడు. అప్పటికే మృతి చెందిన లేగదూడకు తాడు కట్టగా, తన పెద్ద కొడుకు రసపుత్ పవన్(24) పైకి లాగాడు.
లేగ దూడను బయటికి తీసిన చాలాసేపటి వరకు తండ్రి పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన కుమారుడు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ ఎంత సేపటికి బయటికి రాకపోవడాన్ని గమనించిన గ్రామస్తులు పాడు బడిన బావిలో చిక్కుకొని ఉంటారని గమనించి, బయటికి తీసే ప్రయత్నం చేయగా వారు అప్పటికే మృతి చెందారు. ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ ఘటనాస్థలానికి చేరుకొని బావిలో ఉన్న తండ్రీకొడుకుల మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.