తిమ్మాపూర్, ఏప్రిల్ 24: వేసవి సెలవులు రావడంతో ఈతకు వెళ్లిన తండ్రీ, కొడుకు మృతిచెందిన ఘటన వచ్చునూర్ శివారు ఎల్ఎండీ రిజర్వాయర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన చాడ రంగారెడ్డి (46) ఎస్ఆర్కే పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు జయకౌశిక్రెడ్డి, చిన్నకొడుకు చైతన్యానంద్రెడ్డి (9) ఉన్నారు. వీరు బుధవారం ఎల్ఎండీ రిజర్వాయర్లోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోతున్న చిన్న కొడుకును కాపాడే క్రమంలో రంగారెడ్డి కూడా మునిగిపోయారు. ఈత వచ్చిన పెద్ద కొడుకు ఒడ్డుకు వచ్చి బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి జాలర్లతో వెతుకగా అప్పటికే ఇద్దరూ మృతిచెందారు. తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.