జన్నారం, సెప్టెంబర్ 7 : ఐచర్ వ్యాన్ ఢీకొని తండ్రీ, కొడుకులు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన జోగు సాయికుమార్ (36) తన భార్య మంజుల, కుమారుడు లక్ష్మణ్(7)తో కలిసి కొద్ది రోజుల క్రితం జన్నారం మండలం రేండ్లగూడకు వచ్చాడు.
ఇక్కడే తన భార్యతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం ముగ్గురు కలిసి స్వగ్రామం అనంతారం బయలుదేరారు. కలమడుగు వద్దకు చేరుకొని జగిత్యాల బస్ కోసం ఎదురు చూస్తుండగా, ఒక్కసారిగా ఊట్నూర్ నుంచి కోరుట్లకు వెళ్తున్న ఐచర్ వ్యాన్ అతివేగంగా వచ్చి తండ్రీ, కొడుకులతో పాటు పక్కనున్న విద్యుత్ స్తంభం, ఇల్లును ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కళ్లెదుటే భర్తతో పాటు కుమారుడు చనిపోవడంతో మంజుల గుండెలవిసేలా రోదించింది. వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ సతీశ్ తెలిపారు.