వరంగల్/నల్లగొండ: పండుగ పూట విషాదం నెలకొంది. దసరాకు కూతురు, అల్లుణ్ని పిలిచి పండుగ చేసుకుందామని అనుకున్న ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చీకట్లు నింపింది. అత్తారింటి నుంచి కూతురు, అల్లుణ్ని తండ్రి బైక్పై తీసుకెళ్తున్న క్రమంలో మృత్యుశకటంలా దూసుకొచ్చిన ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన వెంకన్న.. కూతురు అనూష, అల్లుడు రాజేశ్ను ఇంటికి పిలిచి దసరా పండుగను ధూంధాంగా చేసుకోవాలని అనుకున్నాడు. శనివారం సాయంత్రం కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు, అల్లుణ్ని వెంటబెట్టుకుని రాత్రి సమయంలో బైక్పై బయల్దేరాడు. అ క్రమంలో కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్ల బైక్ను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు రాజేశ్ను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తి వద్ద అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. డ్రైవర్, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.