బంజారాహిల్స్, జూన్ 11: తాను కోరుకొన్న జీవితం దక్కడం లేదన్న ఆవేదనతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష (36) ఆత్మహత్య చేసుకొన్నది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో తాను నిర్వహిస్తున్న బోటిక్లోనే కార్బన్ మోనాక్సైడ్ను పీల్చి, ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర క్యాడర్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కృష్ణారావుకు చిన్న కుమార్తె అయిన ప్రత్యూష కొంతకాలంగా లోటస్పాండ్ సమీపంలో బోటిక్ను నిర్వహిస్తున్నది. శుక్రవారం ఉదయం బోటిక్కు వచ్చిన ప్రత్యూష.. తాను స్నేహితుల వద్దకు వెళ్తున్నానని, రాత్రి ఇంటికి రానని విజయవాడ వెళ్లిన కృష్ణారావుకు ఫోన్ చేసి చెప్పింది. సాయంత్రం తల్లికి కూడా ఇదే విషయం చెప్పింది.
తనను డిస్టర్బ్ చేయవద్దంటూ బోటిక్ వాచ్మెన్కు చెప్పి, సాయంత్రం 5 గంటల సమయంలో గదిలోకి వెళ్లి పోయింది. ఇక ఆమె బయటకు రాలేదు. రాత్రి 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పటికీ ఎత్తలేదు. శనివారం ఉదయం మరోసారి కాల్ చేయగా స్విచ్చాఫ్లో ఉన్నది. దీంతో ఆమె తల్లి ప్రత్యూష గురించి స్నేహితుల వద్ద ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వాచ్మెన్.. ప్రత్యూష తండ్రికి ఫోన్ చేసి, కాలింగ్ బెల్ నొక్కినా తలుపులు తెరవడం లేదని చెప్పడంతో వారు బోటిక్ వద్దకు చేరుకొన్నారు. స్థానికుల సహాయంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆమె కనిపించలేదు. అటాచ్డ్ బాత్రూం తలుపులు పగలగొట్టడంతో దట్టమైన పొగలు బయటకు వచ్చాయి. ముక్కు మూసుకొని లోపలికి వెళ్లి చూడగా ప్రత్యూష మృతదేహం కనిపించింది. అనంతరం అక్కడకు చేరుకొన్న బంజారాహిల్స్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.
బాత్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ను నిలిపివేసి, కొన్ని బొగ్గులను మండించి, కార్బన్ మోనాక్సైడ్ ద్రావణం ద్వారా దట్టమైన పొగను సృష్టించుకొని, బాత్రూమ్ డోర్ లాక్ చేసుకోవడంతో, గాలిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి, ఊపిరాడక ఆమె చనిపోయినట్టు పోలీసులు నిర్ధ్దారించారు. హైదరాబాద్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకొన్న ప్రత్యూష బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పలువురు సినీతారలకు పర్సనల్ డిజైనర్గా వ్యవహరించారు. మాధురీదీక్షిత్, కాజోల్, విద్యాబాలన్, రవీనాటాండన్, పరిణీతి చోప్రా, శృతిహాసన్, రకుల్ప్రీత్ తదితరులకు డిజైనర్ దుస్తులను రూపొందించిన ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్కు గురిచేసింది. దేశ, విదేశాల్లో నిర్వహించిన ఫ్యాషన్ వీక్స్లో ఆమె ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ వస్ర్తాలకు అవార్డులు లభించాయి. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కోరుకొన్న జీవితం ఇది కాదు
ఆత్మహత్యకు పాల్పడిన ప్రత్యూష రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు. నా తల్లిదండ్రులకు భారం కావద్దనుకుంటున్నా. ప్రతిరోజూ నేను ఏడుస్తున్నా.. అమ్మా, నాన్న.. స్నేహితులు.. అత్మీయులు క్షమించాలి’.. అంటూ సూసైడ్ లెటర్లో ప్రత్యూష రాసింది.