కూసుమంచి, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టు 90 శాతం ఈ రిజర్వాయర్ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆయా మండలాల్లో ప్రస్తుత యాసంగిలో సాగవుతున్న పంటలను కాపాడుకునేందుకు ఇటీవల ఆయకట్టు రైతులు పాలేరు రిజర్వాయర్ వద్దకు వచ్చి నీటి కోసం ఆందోళన చేపట్టారు. పాతకాలువ నుంచి జలాలను దిగువకు వదిలారు. అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఇరిగేషన్ అధికారులు పాతకాలువ గేట్ల వద్ద ముళ్లకంప వేశారు. ఇది జరిగి రెండు వారాలు కాకముందే.. రైతులు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి మంగళవారం మరోసారి ఆందోళనకు దిగారు.
రిజర్వాయర్ పాత కాలువ గేట్ల వద్దకు వెళ్లి ముళ్లకంపను తొలగించారు. రిజర్వాయర్ కట్టపై నుంచి వాహన రాకపోకలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. గేట్లను తెరిచి దిగువకు జలాలు వదిలారు. సమాచారం అందుకున్న ఏసీపీ బీ తిరుపతిరెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి, ఇరిగేషన్శాఖ ఎస్ఈ ఆనంద్, ఈఈలు మంగలపుడి వెంకటేశ్వర్లు, అనన్య, డీఈలు రత్నకుమారి, మధు, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ మురళీకృష్ణ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. కొన్ని గంటలపాటు రైతులతో చర్చలు జరిపారు. ఇరిగేషన్శాఖ సీఈ విద్యాసాగర్ బుజ్జగించడంతో రైతులు ఆందోళనను విరమించడంతో ఇరిగేషన్ అధికారులు పాతకాలువ గేట్లను మూసివేశారు. అయితే.. రైతులు తమ ఇండ్లకు వెళ్లకుండా మంగళవారం రాత్రి పాలేరు రిజర్వాయర్ కాలువపైకి వచ్చి ఆందోళన చేశారు. అధికారులు గేట్లకు వెల్డింగ్ పెట్టకుండా అడ్డుకొని అక్కడే చలిమంటలు వేసుకొని కాపలా ఉన్నారు.