శాయంపేట,మే 17 : నకిలీ విత్తనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామంటూ వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 22 మంది రైతులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. గట్లకానిపర్తిలోని శ్రీవేంకటేశ్వర ఫర్టిలైజర్ డీలర్ కుసుమ మురళిపై ఫిర్యాదు చేశారు. డీలర్ తమకు నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచాడని ఆరోపించారు. డీలర్ మురళి.. కావేరి 929 రకం ఆడ, మగ వరి విత్తనాలను ఇచ్చాడని, పంటసైతం తానే కొంటానని అగ్రిమెంట్ రాయించుకున్నాడని, తీరా నకిలీ విత్తనాలని తేలడంతో ఎకరాకు 10 కిలో ల పంట కూడా రావడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను, అధికారులను కోరారు.