వీర్నపల్లి, జూన్ 30 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లికి చెందిన 171 మంది రైతులు 15 లారీల వడ్లను ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించి 20 రోజులు గడిచినా రాకపోవడంతో విసిగిపోయారు.
మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్ను ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉన్నా.. ఎందుకు డబ్బులు వేయడం లేదని ప్రశ్నించారు. ఐకేపీ సీసీ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.