హుస్సేన్మియా వాగు ఎండటంతో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పొలాలన్నీ ఎండుతున్నాయి. దీంతో కడుపుమండిన అన్నదాతలు ఎస్సారెస్పీ 10 ఎల్ కాలువకు దస్తగిరిపల్లి వద్ద దిగువన గండిపెట్టారు. కాలువకు అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించారు. నీరంతా దిగువకు ఉరకలు వేస్తుండగా, దస్తగిరిపల్లి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
SRSP | పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 3: కాల్వ నీటిపై ఆధారపడి వేసిన పంట ఎండుతున్నది.. ఆరుగాలం పడిన కష్టం మం టగలుస్తున్నది. దీంతో కడుపుమండిన రైతు కాల్వకు గండి కొట్టి పంటను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కెనాళ్లకు గండ్లు పెట్టి అన్నదాతలు నీటిని తరలించుకుపోతున్నారు. పెద్దపల్లి మండలం దిగువన కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఒకప్పుడు హుస్సేన్మియా వాగుతోపాటు ఎస్సారెస్పీ కాలువ ద్వారా పుష్కలంగా జలాలు అందేవి.
ఈ సీజన్లో హుస్సేన్మియా వాగు నుంచి పరిసర గ్రామాల్లోని పొలాలకు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఇటీవలే హుస్సేన్మియా వాగుపై పెద్దపల్లి మండలం భోజన్నపేట-మూలసాల మధ్య చెక్డ్యాంను పేల్చేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ ఘటన మరువకముందే శనివారం ఎస్సారెస్పీ 10ఎల్ కాలువకు పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి వద్ద దిగువ రైతులు గండిపెట్టారు. కాలువకు అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించారు.
ఇక్కడి నుంచి నీటిని సమీపంలోని కొత్తపల్లి వాగుకు తరలించుకొని, అక్కడి నుంచి హుస్సేన్మియా వాగుకు మళ్లించుకున్నారు. దీంతో నీరంతా దిగువకు ఉరకలు వేస్తుండగా, దస్తగిరిపల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరంతా దిగువకు వెళ్తే తమ పరిస్థితి ఏం టని, అధికారుల, లస్కర్ల పర్యవేక్షణలోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం.