వికారాబాద్, ఫిబ్రవరి 27, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకొనేది లేదని రైతులు హెచ్చరించారు. భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం ఎదుట కాళ్లపూర్ రైతులు శుక్రవారం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామ పంచాయతీల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములను సేకరించేందుకు నిర్ణయించారు. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి కాళ్లపూర్, రాపోల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తమ బతుకులు ఆగం ఆవుతాయని, వలస పోవాల్సిన పరిస్థితులు ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా నుంచి సీఎం రేవంత్రెడ్డితోపాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిని గెలిపిస్తే తమను రోడ్డు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారంరోజులుగా తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేసిన రైతులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడంతోపాటు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
రైతులకు మద్దతుగా కాళ్లపూర్ కాంగ్రెస్ సర్పంచ్ సోమగారి పుల్లయ్య ధర్నాలో పాల్గొని ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా కాళ్లపూర్ రైతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి, రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయడం ఏంటని పశ్నించారు. ఇండస్ట్రియల్ పార్కుకు జారీచేసిన భూసేకరణ ప్రక్రియ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, వికారాబాద్ ఆర్డీవోకు వినతిపత్రాలు అందజేశారు.