Minister Errabelli | శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షాలతో జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడూరు గ్రామ వాగు వరద ఉధృతి పెరిగింది. పెద్దమడూరు గ్రామవాసులు అంతటి యాకయ్య, అంతటి సోమయ్య, చౌడవేణి యాదగిరి, బోనగిరి పెద్దులు అనే రైతులు ఉదయం తమ పంట భూముల్లో పనులకు వెళ్లి తిరిగి వస్తూ వాగు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. వరద మధ్య చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఎంతకూ వరద ఉధృతి తగ్గకపోగా, మరింత పెరిగింది. దీంతో వారు చెట్లపైనే ఉండిపోయారు.
ఈ సమాచారం తెలిసిన గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కూడా సమాచారం అందించారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీసీపీలకు మంత్రి ఎర్రబెల్లి ఫోన్ చేసి వారిని కాపాడాలని ఆదేశించారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగారు. అప్పటికే వరద ఉధృతి పెరిగిపోయింది. మరోవైపు చీకటి పడుతున్నది. దీంతో చేతి లైట్లు, సెల్ ఫోన్ల వెలుతురులో పోలీసులు, రెస్క్యూటీం గుర్తించి ఆ నలుగురిని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. దీంతో వరదలో చిక్కుకున్న ఆ నలుగురు రైతులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులను కాపాడిన పోలీసులు, అధికారులు, రెస్క్యూ టీమ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందించారు. నలుగురు రైతులతోనూ మాట్లాడారు. పోలీసులు, రెస్క్యూ టీం, అధికారులకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.