హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) ః ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవటానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు. ఉచ్చులు పెట్టడం, పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయటానికి పొగ పెట్టటం, పురుగుమందులను ఉంచటం లాంటివి ఎన్ని చేసినా ఎలుకల సమస్య రైతులను పట్టి పీడిస్తూనే ఉంటుంది. దీనికి విరుగుడుగా ఇప్పుడు ఓ కొత్త పద్ధతిని రైతులు అవలంబిస్తున్నారు.
మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఓ కర్రకు చిట్టీ కట్టి పొలంలో నాటితే చాలు.. ఇక ఎలుకల బెడద ఉండనే ఉండదట. సిద్దిపేట జిల్లాలోని వందలాది రైతులు ఇప్పుడు ఈ ఎలుకల చిట్టీ కోసం దీని రూపకర్త, రైతు అయిన రాజిరెడ్డికి పరుగులు తీస్తున్నారు. ఇది మూఢనమ్మకమే అయినా.. ఎలుకల బెడద నుంచి పంటలను కాపాడుకోవటానికి రైతులు పడుతున్న తాపత్రయానికి ఉదహారణగా నిలుస్తున్నది.
భూంపల్లిలోని నాగారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇంటి దగ్గర వరి రైతులు బారులు తీరుతున్నారు. ఎలుకల చిట్టీల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందంటే ఏకంగా నాలుగు గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తున్నది. రైతులు తమ పేరు, భూమి విస్తీర్ణం, గ్రామం పేరు తదితర వివరాలిస్తే.. ప్రత్యేకంగా ఓ మంత్రాన్ని సర్వే నెంబర్తో సహా రాసి రాజిరెడ్డి ఇస్తాడు.
చిట్టీ అందుకున్నాక ఎక్కడా ఆగకుండా నేరుగా పొలానికి వెళ్లి చిట్టీకట్టిన కర్రను నాటాలి. ప్రతి సీజన్లో ఎలుకల వల్ల 80 నుంచి 90 శాతం పంటకు నష్టం వాటిల్లేదని, ఈ చిట్టీని కట్టడం వల్ల ఆ బాధ తప్పిందని నారాయణరావు పేటకు చెందిన రైతు మహంకాళి భిక్షపతి తెలిపారు. తాను గత ఐదేండ్లుగా ఈ చిట్టీని పొలంలో కడుతున్నానని చెప్పారు.
ఈ విషయం బాగా ప్రాచుర్యం పొందటంతో సిద్దిపేటతోపాటు పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల, ఇతర జిల్లాల రైతులు కూడా రాజిరెడ్డిని కలవటానికి వస్తున్నారట. నిత్యం వంద మందికిపైగా ఈ చిట్టీలను తీసుకొని వెళుతున్నారని చెప్తున్న రాజిరెడ్డి ఒక్కో చిట్టీకి 50 నుంచి వంద రూపాయల దాకా వసూలు చేస్తున్నానని తెలిపారు. అయితే ఆ చిట్టీలో రాసిన అక్షరాలను ఎవరూ చదవలేకపోతున్నారు. ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలేవో ఉన్నట్టు తెలిసింది.