Mirchi Crop | మహబూబాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గుబ్బరోగం మిర్చి రైతుల జీవితాలను ఆగమాగం చేస్తున్నది. మిర్చి పంటలకు తెగుళ్లకు తోడు ఇటీవలి తుఫాన్ ప్రభావంతో గుబ్బరోగం సోకుతున్నది. ఒక మొక్క నుంచి మరో మొక్కకు పురుగులు వేగంగా విస్తరిస్తూ పూతను రాలుస్తున్నాయి. ఈ పురుగులు మొక్క లో ఉన్న రసం మొత్తాన్ని పీల్చేస్తున్నాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతున్నది. పూత, పిందెలు నేల రాలిపోతున్నాయి.
రైతులు మందులు పిచికారి చేసిన ఒకటి రెండు రోజులపాటు పురుగులు కనబడకుండా పోతున్నా, తిరిగి మళ్లీ విజృంభిస్తున్నాయి. పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరిగి, దిగుబడి భారీగా తగ్గడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒక ఎకరా మిర్చికి సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట 10 నుంచి 12 క్వింటాళ్లు కూడా రాకపోవడం రైతులను కలవర పెడుతున్నది. పంట పెట్టుబడి విపరీతంగా పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా లో గత వారం రోజుల్లోనే ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, మరో మహిళా రైతు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
జగ్గుతండాలో మిర్చి రైతు ఆత్మహత్య
నర్సింహులపేట మండలం జగ్గుతండాకు చెందిన అజ్మీరా శ్రీనుకు మూడెకరాల భూమి ఉన్నది. ఇందులో రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. గుబ్బరోగం సోకి అంతా నాశనమైంది. మిర్చి పంట సాగుకు సుమారు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఒక్క రూపాయి కూడా పంట మీద వచ్చే అవకాశం లేకపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలనే మనోవేదనకు గురైన రైతు శ్రీను ఈ నెల 11న తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో ప్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీను మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
మిర్చి తోటలోనే గడ్డిమందు తాగి..
కేసముద్రం మండలం క్యాంపు తండా కు చెందిన రైతు దరావత్ వీరన్న-లలిత దంపతులకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. ఎకరంలో పత్తి, మరో ఎకరంలో వరి, ఇంకో ఎకరంన్నరలో మిర్చి సాగు చేశారు. పత్తి చేను దున్నడం, విత్తనాలు, ఎరువులు, యూరియా, కూలీలు తదితర పెట్టుబడి కోసం రూ.40వేలు ఖర్చు చేశా రు. ఇంత చేసినా రెండు క్వింటాళ్ల పత్తి మా త్రమే వచ్చింది. తరువాత పూత, కాత లేదు. పత్తిచేనుకు గులాబీ పురుగు సోకిం ది. ఎన్ని రకాల మందులు పిచికారి చేసి నా ఫలితం లేదు. ఎకరంలో సన్న రకం వరి వేశారు. 25 క్వింటాళ్ల ధాన్యం రావా ల్సి ఉండగా 14 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వీటిని అమ్మగా రూ.30,842 వ చ్చాయి. పెట్టుబడి మాత్రమే తిరిగొచ్చింది.
మిగిలిన ఎకరంన్నర భూమిలో మిర్చి సాగు చేశారు. మధ్యమధ్యలో మొక్కలు చనిపోతే నర్సరీ నుంచి కొనుగోలు చేసి మరీ నాటారు. మిర్చి తోటకు గుబ్బరోగం సోకడంతో ఊక మందులు పిచికారి చేశా రు. మిర్చిని కాపాడుకునేందుకు రూ.1.90 లక్షలు అప్పు చేశారు. పూత,కాత లేక మిర్చి పంటను తొలగించి మక్కజొన్న వేసేందుకు 20 గుంటల భూమిని ట్రాక్టర్తో దున్నించాడు. మిగిలిన ఎకరంలో కూడా మిర్చి పంటను దున్ని మక్కజొన్న వేద్దామని అనుకున్నాడు. అయితే, భార్య లలిత మిర్చి తోట ఉంచాలని కోరింది.
మిర్చి పంటను కాపాడే ప్రయత్నంలో ఈ నెల 8న మందు పిచికారి చేస్తున్న వీరన్న మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. సమీపంలోనే పనిచేస్తు న్న వీరన్న భార్య లలిత కూడా మందు తాగింది. దీంతో ఇద్దరినీ మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వీరన్న పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఎంజీఎం దవాఖాన కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ ఈ నెల 13న మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న లలిత పరిస్థితి కూడా అత్యం త విషమంగా ఉన్నదని డాక్టర్లు చెప్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వీరన్న తండ్రి లచ్చు కోరారు.
మిరప కాతలేదు
రెండున్నర ఎకరాల్లో మిరప సాగు చేసిన. ఇం దులో ఎకరం 30 గుంట లు కౌలుకు తీసుకున్నా. గుబ్బరోగం, నల్లి సోకి అర ఎకరం ఎండిపోయింది. కాయలు కాయడం లేదు. మొత్తం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టిన. రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదు.
– లకావత్ బిచ్చు, రైతు, బీల్యాతండా, నర్సింహులపేట
రూపాయి రాలేదు
రెండున్నర ఎకరాల్లో మిర్చిసాగు చేశా. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎండురోగం, నల్లి, గుబ్బరోగం వచ్చింది. మందులు పిచికారీ చేసినా చేను కోలుకోలేదు. రూ.2 లక్షలు పెట్టిన.
– భూక్యా భద్రు, రైతు, కల్వల, కేసముద్రం
అవగాహన కల్పిస్తున్నాం
రెండేండ్ల నుంచి మిర్చికి గుబ్బ వైరస్ సోకుతున్నది. దిగుబడి బాగా తగ్గింది. గుబ్బరోగంతోపాటు జెమినీ వైరస్ గురించి కూడా రైతులకు అవగాహన కల్పించాం. తుపాన్తో వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనితో గుబ్బ వైరస్ విస్తృతమై మిర్చి పంటను నాశనం చేస్తున్నది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– సూర్యనారాయణ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, మహబూబాబాద్