ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట/బోధన్ రూరల్, ఏప్రిల్ 5: అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన రాళ్లవాన పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి నేలవాలింది. వడ్లు రాలిపోయాయి. గ్రామంలోని సుమారు 120మంది రైతులకు చెందిన 250 ఎకరాల్లో వరి పాడైపోయింది. కమ్మరిపేట తండాలో 25మంది రైతులకు చెందిన 35 ఎకరాల పంట దెబ్బతిన్నది. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో మామిడి తోట అద్దె రైతు అబ్బేని భీమయ్యకు కన్నీరే మిగిలింది.
ముదిరాజ్ సంఘానికి చెందిన ఆరున్నర ఎకరాల మామిడి తోటను రూ.5 లక్షలకు అద్దెకు తీసుకోగా, అకాల వానతో చేతికందే దశలో కాయలన్నీ నేలరాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. సాలూరా మండలంలో దెబ్బతిన్న పంటలను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆదివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా నిజామాబాద్ రూరల్ మండలంలోని మాధవనగర్లో విద్యుత్షాక్తో ఐదు గేదెలు మృత్యువాతపడ్డాయి.