జయశంకర్ భూపాలపల్లి : రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపి లాభాలను గడించాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. చిట్యాల మండలం నైన్ పాక, జూకల్ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. అదేవిధంగా నైన్ పాకలో నూతన అంగన్వాడీ భవనాన్ని, సివిల్ దవాఖానాలో ఫొటో థెరపీ, ఆపరేషన్ థియేటర్లో హెడ్లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..రైతుల పరిష్కార వేదికలుగా రైతు వేదికలు ఉపయోగపడనున్నాయని తెలిపారు. రైతులంతా సంఘటితమై వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.