అందోల్/సంగారెడ్డి : రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజలు ప్రజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీన్ని గుర్తించి రైతులు యాసంగీ సీజన్లో వరికి బదులు పప్పులు, నూనెగింజలు..ఇతర లాభాదాయక పంటలపై దృష్టి పెట్టాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
వానాకాలంలో రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతధణిని అవలంబిస్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వం రైతులుకు ఇబ్బందులు రాకుండా వరస క్రమంలో ధాన్యం కొంటున్నదని చెప్పారు.
ఇలాంటి ఇబ్బందుల మధ్య మళ్లీ రైతులు వరి సాగుచేయడంతో ఇంకా ఇబ్బంది పాడాల్సి ఉంటుందన్నారు. అంతే కాకుండా వరుసగా ఒకే పంట సాగు చేయడంతో భూములు దెబ్బతింటాయన్నారు.
ఇప్పటి నుంచి రైతులు ఒకే రకమైన పంటల సాగుపై దృష్టి పెట్టకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కొత్త పంటలను సాగుచేసే విధానానికి సిద్ధం కావాలని సూచించారు.
రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సైతం రైతులకు లాభదాయక పంటలపై తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఇప్పుడూ అందుబాటులో ఉంటారని వారి సేవలు వినియోగించుకోవాలన్నారు.
రైతులు తమ పొలాల్లో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న తదితర సంప్రదాయ పంటలు వేసి మంచి లాభాలు పొందాలని సూచించారు.