మెదక్ : వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. మంగళవారం పాపన్నపేట మండలంలో 13 వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించినట్టు వివరించారు.
మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. మీ కోసం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.
అనంతరం మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 68 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.29,41,500 విలువ చేసే చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీనివాస్, కిశోర్, మెదక్, నిజాంపేట మండలాల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, సుధాకర్రెడ్డి, మెదక్, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్లు హన్మంతరెడ్డి, చంద్రం తదితరులు పాల్గొన్నారు.