వరంగల్ : తెలంగాణలో నాడు వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడగా..నేడు సంక్షేమంలో దూసుకెళ్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని దర్గా కాజీపేటలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలభిషేకం చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో రైతుల గౌరవం పెరిగిందన్నారు. రైతును గౌరవించిన రాజ్యమే శ్రేయోరాజ్యం గా మిగులుతుందన్నారు. రైతుల చేయూతనిచ్చేందుకే రైతుబంధు
పథకం అన్నారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు జమ అయ్యాయని తెలిపారు.
తెలంగాణలో పండే పంటలను కొనలేమని కేంద్రం చేతులెత్తేసే స్థాయికి వచ్చిందంటే అది తెలంగాణ ఘనత అన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో కేవలం 5,6 లక్షల మోటర్లకే కరంటు వసతి ఉంది. 25 నుంచి 30 లక్షల ఆయిల్ మోటర్లు ఇప్పటికీ ఉండడం గమనార్హం అన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినదే నని తెలిపారు.
సాగునీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ఎదురొచ్చి ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే రమేష్, రైతు బంధు కో అర్డినేటర్ లలిత, కార్పొరేటర్లు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.