కంఠేశ్వర్, ఫిబ్రవరి 26: నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లిన క్రమంలో తలుపుల అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయంలో అధికారులను నిలదీయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. మార్కెట్ యార్డులో మూడు రోజులుగా ‘ఈ నామ్’ పనిచేయకపోవటంతో పసుపు కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ నామ్ అప్లికేషన్ వెర్షన్ 1.0 నుంచి 2.0కి అప్గ్రేడ్ కావడంతో అది సరిగా పనిచేయక కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనిపై మార్కెట్ సిబ్బంది ఉన్నతాధికారులను సంప్రదించగా వారం రోజులపాటు పాత పద్ధతిని ఉపయోగించాలని సూచించారు.
అందుకనుగుణంగా చర్యలు తీసుకోక పోవడంతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడింది. మూడ్రోజులుగా మార్కెట్కు భారీగా పసుపు రావడం, కొనుగోళ్లు నిలిచి పోవడం రైతులు కలవరపాటుకు గురయ్యారు. వారం రోజులుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు.. మార్కెట్లోని పరిస్థితులను చూసి ఆగ్రహానికి గురై మార్కెట్ కమిటీ కార్యాలయంలో దూసుకెళ్లారు. త్వరగా పసుపు కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆందోళనకు దిగారు. ఈ నామ్ అప్లికేషన్ అప్డేట్ కారణంగా పనిచేయక పోవడంతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడిందని మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఓపెన్ టెండర్ ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.